మీర్పేట్ ఖాళీ..!
ABN , First Publish Date - 2020-10-20T07:30:56+05:30 IST
మీర్పేట్ పెద్దచెరువుకు లీకేజీలు ఏర్పడి ప్రమాదకరంగా మారడంతో దాని దిగువన గల కాలనీలకు చెందిన ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు.
సరూర్నగర్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మీర్పేట్ పెద్దచెరువుకు లీకేజీలు ఏర్పడి ప్రమాదకరంగా మారడంతో దాని దిగువన గల కాలనీలకు చెందిన ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. వారం రోజులుగా నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులు.. చెరువు లీకేజీలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. జనప్రియ మహానగర్లోని 10 బ్లాకులలో కలిపి 1250 ఫ్లాట్లు ఉండగా, వాటిలో సగానికి పైగా ఫ్లాట్లను నివాసితులు ఖాళీ చేసేశారు. వారిని అధికారులు, స్థానిక నాయకులు, ట్రాక్టర్లు, ఎక్సకవేటర్లు, పడవల ద్వారా ఇళ్ల నుంచి బయటకు తరలిస్తున్నారు. న్యూబాలాజీనగర్, ఎంఎల్ఆర్ కాలనీ, ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ, తిరుమలాఎన్క్లేవ్, అనురాగ్ కాలనీ తదితర ప్రాంతాల వరద బాధితుల్లో 60 శాతం మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు. దుస్తులు, విలువైన వస్తువులు, నగదు, సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు తీసుకుని బయటపడుతున్నారు.