ఏసీ మిర్చి క్వింటా రూ.16,900
ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. శుక్రవారం ఈ మార్కెట్లో
ఖమ్మం మార్కెట్లో పెరుగుతున్న ధరలు
ఖమ్మం మార్కెట్ , సెప్టెంబరు 18 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. శుక్రవారం ఈ మార్కెట్లో కోల్డ్స్టోరేజీలలో నిల్వ ఉంచిన ఏసీ మిర్చి క్వింటా రూ.16,900కు జెండా పాట ధర నిర్ణయించారు. మార్కెట్లో వారం క్రితం క్వింటా రూ.16,000 నుంచి 16.500 పలికిన డీలక్స్ రకం రూ.500 నుంచి రూ. 1000 పెరిగి ప్రస్తుతం రూ. 16,900కు చేరింది. ఎర్ర బంగారానికి దేశీయంగా, అంతర్జాతీయంగా సింగపూర్, మలేషియా, థాయ్లాండ్ తదితర దేశాలకు ఎగుమతులు ఊపందుకోవడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడుతుండటంతో ఎగుమతులు నిలిచిపోయాయి.
దీంతో రానున్న రోజులలో మిర్చి ధరల పెరుగుదలపై ఎటూ చెప్పలేని పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. మిర్చి నాణ్యతను బట్టి క్వింటాలు రూ.15000 నుంచి రూ.16000 వరకు కొనుగోలు చేశారు. ఎండు మిరప ధర రూ.17,000కు చేరువలో ఉండటంతో రైతులు తమ పెట్టుబడి అవసరాలకోసం కోల్డ్స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తమ పంటను అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం మార్కెట్కు సుమారు వెయ్యి శాంపిల్ బస్తాలు రాగా.. సుమారు 20వేల బస్తాలు వరకు కోల్డ్స్టోరేజీల వద్ద కాంటాలు నిర్వహించారు.