మిర్చి రూ. 700, టమాటా రూ. 200...

ABN , First Publish Date - 2022-01-15T00:18:33+05:30 IST

మిర్చి రూ. 700, టమాటా రూ. 200...

మిర్చి రూ. 700, టమాటా రూ. 200...

హైదరాబాద్ : అక్కడ ద్రవ్యోల్భణం భారీగా పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏ కూరగాయ ధరైనా... రూ. 200 పైమాటే. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇక కూరగాయలే కాదు... గ్యాస్ సిలిండర్, పాల పొడి ధరలు  ఇదే దారిలో పరుగులు తీస్తున్నాయి. కిలో టమాటా రూ. రూ. 200, కిలో మిర్చి రూ. 700. ఎప్పుడూ విని ఉండని ఈ ధరలను చూస్తే... నోరెళ్ళబెట్టక మానం. మన పొరుగు దేశమైన శ్రీలంకలో ప్రస్తుతం కూరగాయల ధరలివి. ఈ భారీ ధరలతో...  ప్రజలు సతమతమవుతున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావంతో శ్రీలంక కుదేలయ్యింది. 


శ్రీలంక ప్రభుత్వం దివాలా తీస్తోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. మరో వారం నాటికి పరిస్థితి ఇంకా దిగజారనున్నట్లు చెబుతున్నారు. దేశం దివాలా తీస్తుందా ? లేదంటే సంక్షోభం నుంచి బయట పడుతుందా ? అన్నది వచ్చే వారం తేలుతుంది. ఈ ఏడాది(2022 లో( శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగానే ఉన్నాయి. జనవరి నెలలో ఇంటర్నేషన్ సావరిన్ బాండ్లకు 500 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్’ చెబుతోంది. అలాగే జూలై నెలలో ఒక బిలియన్ డాలర్ల మేర చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులు జరగనిపక్షంలో... శ్రీలంకను ‘డిఫాల్టర్‌’గా ప్రకటిస్తారు. ఈ నేపధ్యంలో శ్రీలంక... అటు చైనా, ఇటు భారత్‌ల  సాయాన్ని కోరుతోంది. రుణం కోసం చర్చలు జరుపుతోంది. కోవిడ్ సంక్షోభం, క్రూడ్ ధరలు పెరిగిపోవడం, దిగుమతుల భారం పెరిగిపోవడం తదితర పరిణామాల నేపధ్యంలో శ్రీలంకలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిందని, ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. 


ఇప్పుడు ఆ దేశంలో కిలో మిర్చి ధర రూ. 710. కిలో టమాటా కొనాలంటే రూ. 200 చెల్లించుకోవాల్సిందే. బెండకాయలు కొనాలంటే కిలోకు రూ.  200 సమర్పించుకోవాలి. ఇంకా బీన్స్ ధర అయితే చెప్పనక్కర్లేదు.. కిలోకు ఏకంగా రూ. 320 ధర సమర్పించుకోవాల్సిందే. క్యారెట్ రేటు కూడా కిలోకు రూ. 200  ఉంది. మిల్క్ పౌడర్, గ్యాస్, ఇంకా తదితరాల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. గ్యాస్ ధర నాలుగు నెలల్లోనే 80 శాతం పెరిగింది. 

Updated Date - 2022-01-15T00:18:33+05:30 IST