అమ్మను చూసి బోరుమంది
ABN , First Publish Date - 2021-07-28T09:50:41+05:30 IST
ఒలింపిక్ రజతంతో మురిపించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు స్వరాష్ట్రం మణిపూర్లో ఘనస్వాగతం లభించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానాశ్రయం నుంచి బయటికి వచ్చిన ఆమె...
- చాను భావోద్వేగం
ఇంఫాల్: ఒలింపిక్ రజతంతో మురిపించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు స్వరాష్ట్రం మణిపూర్లో ఘనస్వాగతం లభించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానాశ్రయం నుంచి బయటికి వచ్చిన ఆమె.. తల్లిదండ్రులను చూశాక తీవ్ర భావోద్వేగానికి గురైంది. తల్లి లీమాను హత్తుకున్న క్షణాన ఆమె నేత్రాలు సజలాలయ్యాయి. ముఖ్యంగా ఒలింపిక్ పతకం కోసం మీరా తల్లి తన బంగారంతో ఐదు రింగ్స్తో కూడిన చెవి కమ్మలను కూతురి కోసం చేయించింది. ఇవి ధరించే చాను రజతం అందుకోవడం విశేషం. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మణిపూర్ సీఏం బీరేన్ సింగ్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైంది. ఈ సమయంలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలిచి చప్పట్లతో స్వాగతించారు.
పిజ్జా వచ్చేసింది..: మీరాబాయి చాను పిజ్జా తినాలనే కోరిక తీరింది. టోక్యోలో పతకం గెల్చుకున్నాక తనివితీరా పిజ్జా తినాలని ఉందంటూ మీరా చెప్పింది. దీంతో డామినోస్ కంపెనీ ఆమెకు జీవితకాల ఉచిత ఆఫర్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే మీరా ఇంటికి రాగానే డెలివరీ కూడా చేసేసింది.