10న ఢిల్లీకి సీఎం
ABN , First Publish Date - 2022-05-08T16:33:35+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈనెల 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవలే బెంగళూరు పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో
- మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు
బెంగళూరు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈనెల 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవలే బెంగళూరు పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ముఖ్యమంత్రి విస్తరణ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మరోసారి ఢిల్లీకి రావాలని అమిత్షా సూచించిన మేరకు సీఎం పయనమవుతున్నారు. ఈనెల 10న ఢిల్లీ వెళ్లే ముఖ్యమంత్రి 11న వెనుతిరిగి రానున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో విస్తరణ అంశంపై చర్చించగా తాజాగా అమిత్షాతోనూ కూలంకుషంగా చర్చలు సాగాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళితే మంత్రివర్గ విస్తరణ ఖరారైనట్టేనన్న చర్చలు సాగుతున్నాయి. మాజీ సీఎం యడియూరప్ప దుబాయ్ పర్యటనకు వెళ్లే ముందు శనివారం మీడియాతో మాట్లాడుతూ మరో మూడు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ అంశం ఖరారు కానుందన్నారు. ఇందుకు తగ్గట్టుగానే సీఎం 10న ఢిల్లీ వెళుతున్నారని చెప్పారు. కేబినెట్లో ఖాళీగా ఉన్న 5 స్థానాలు మాత్రమే భర్తీ చేస్తారా లేదా మరింతమంది చేత రాజీనామాలు చేయించి ప్రక్షాళన చేస్తారా..? అనేది ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసేదాకా రహస్యమే. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనే అంశం గత వారం హల్చల్ చేయగా అమిత్షా బెంగళూరులో అటువంటి ప్రస్తావనలు లేవని తేల్చడంతో ఇక ఏడాదిపాటు బసవరాజ్ బొమ్మై పదవికి ఢోకా లేదని నిర్ధారణ అయింది. కొత్త మంత్రుల ద్వారా నూతన ఉత్సాహంతో రాష్ట్రంలో మరిన్ని మార్పులు చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.