మేడారం జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు
ABN , First Publish Date - 2021-12-30T21:25:37+05:30 IST
మేడారం జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు
హైదరాబాద్: మేడారం జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు గురువారం సమీక్షనిర్వహించారు.మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలని,ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలన్నారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని, గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని, వాటిని ఈసారి అధిగమించేలా చూడాలని అన్నారు.
తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, ఇతర సొకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకెడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి.జాతరకు వచ్చే భక్తులకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, స్నాన ఘట్టాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.రహదారుకిరువైపుల ఆర్ అండ్ బీ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు.భక్తుల రధ్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకొవాలని పేర్కొన్నారు.
పోలీసు ప్రత్యేక కంట్రోల్రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలన్నారు.జాతర అనంతరం చెత్త తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,జనవరి 15 లోగా పనులు పూర్తి అయ్యేలా ఆధికారులు పని చేయాలని ఆదేశించారు. జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నానఘట్టాలను, షెడ్లను, ఇతర పనులను మంత్రులు పరిశీలించారు.అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఎస్పీ సంగ్రామ్సింగ్, ఇతర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.