తుస్సు యాత్ర
ABN , First Publish Date - 2022-05-29T06:05:26+05:30 IST
తుస్సు యాత్ర
రెండు జిల్లాల్లో మంత్రుల బస్సు యాత్రకు ఆదరణ కరువు
ఆద్యంతం మహానాడుపై విమర్శలే..
స్వాగతం పలికేందుకు ముందుకురాని స్థానికులు
జనసమీకరణలోనూ విఫలం
విజయవంతం చేసేందుకు పోలీసుల అత్యుత్సాహం
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభన
గంటల తరబడి వాహనదారుల అవస్థలు
గన్నవరంలో ఎన్టీఆర్ జయంతికి అడ్డుగా వేదిక
మంత్రుల సామాజిక బస్సు యాత్ర రెండు జిల్లాల్లో తుస్సుమంది. కనీసం స్వాగతం పలికేందుకు సరిపడా జనం లేకపోవడంతో అంతా ఓ ‘షో’గా సాగిపోయింది. హనుమాన్ జంక్షన్, గన్నవరం, బెంజిసర్కిల్ వద్ద జాతీయ రహదారిపైనే సభలు ఏర్పాటుచేయడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, ముఖ్యంగా మహిళా మంత్రులు బస్సు నుంచి కాలు కిందకు పెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ /గన్నవరం) : మంత్రుల సామాజిక బస్సు యాత్ర శనివారం ఇరు జిల్లాల్లోకి ప్రవేశించింది. మొదట ఎంచుకున్న పాయింట్లు తప్ప ఎక్కడా జన స్వాగతాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు జన సమీకరణ కోసం అష్టకష్టాలు పడ్డారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనం రాలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసే వారిని గన్నవరం సభకు తరలించారు. అలాగే, కొంతమంది డ్వాక్రా గ్రూపు సభ్యులను బలవంతాన రప్పించారు. గన్నవరంలో 10 వేల మందితో సభ నిర్వహిస్తున్నామని ఘనంగా చెప్పారు. తీరా చూస్తే 2 వేల మంది కూడా కనిపించలేదు. మంత్రుల బృందం రాగానే గన్నవరం సభ నుంచి డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ పథకం కూలీలు వెళ్లిపోయారు. జనం కంటే వాహనాల బారులే ఎక్కువగా కనిపించాయి. భారీ కాన్వాయ్తో జంక్షన్ తర్వాత గన్నవరం మీదుగా విజయవాడకు బస్సు యాత్ర చేరుకుంది. మంత్రుల బృందం కావటంతో పోలీసులు అడుగులకు మడుగులొత్తారు. ఒక రకంగా బస్సు యాత్రను విజయవంతం చే సే బాధ్యతలను పోలీసులే తీసుకున్నారు. మంత్రుల సభలన్నీ కూడా ఇంచుమించు ట్రాఫిక్ కూడళ్లలోనే నిర్వహించారు. ప్రధాన రోడ్లను దిగ్బంధించారు. జాతీయ రహదారిపైనే డైవర్షన్ ప్లాన్ను అమలు చేశారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకలకు అడ్డుగా..
గన్నవరంలో సభా వేదిక ఏర్పాటు తీరు విమర్శలకు దారితీసింది. గాంధీచౌక్లో గన్నవరం-ఆగిరిపల్లి వెళ్లే మార్గంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. వాస్తవానికి పెద్ద ఎత్తున సభ నిర్వహించాలనుకుంటే తీన్మూర్తి చౌక్లో చేపట్టవచ్చు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ విగ్రహం వద్దే వేదికను ఏర్పాటు చేశారు. స్టేజీ వెనుక ఆనుకుని ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఏటా ఇక్కడ ఘనంగా ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తారు. ఈసారి ఆ అవకాశం లేకుండా చేశారు. ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయటానికి వచ్చిన టీడీపీ నేతలు విస్మయం చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించక పోవటంతో చేసేదేమీ లేక, వెనుక నుంచి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి వెళ్లిపోయారు.
మహిళా మంత్రులు బస్సు దిగనేలేదు
హోంమంత్రి తానేటి వనితతో పాటు పలువురు మహిళా మంత్రులు, వివిధ కార్పొరేషన్ల మహిళా చైర్పర్సన్లు బస్సు దిగలేదు. గన్నవరం సభలో చాలావరకు మహిళా ప్రజాప్రతినిధులు బస్సు దిగకపోవటం విమర్శలకు దారితీసింది. మండుటెండలో నిలుచుని ఎదురుచూస్తుంటే, మంత్రులు ఏసీ బస్సు దిగకపోవటంపై కొందరు కార్యకర్తలు అసహనం చెందారు.
గన్నవరంలో దుట్టా, యార్లగడ్డ దూరం
గన్నవరం, హనుమాన్ జంక్షన్లలో జరిగిన సభలో దుట్టా రామచంద్రరావు, శివభరత్రెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు పాల్గొనలేదు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు పాల్గొంటున్న ప్రతిష్టాత్మక బస్సు యాత్రకు వీరికి ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే వంశీ వర్గం మాత్రమే ఈ యాత్రలో పాలుపంచుకుంది. వంశీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, పేర్ని నాని, కొడాలి నాని హాజరయ్యారు. పేర్ని నాని సభాధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు.