మంత్రులు 25.. సలహాదారులు 50

ABN , First Publish Date - 2021-07-25T07:46:34+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు 25 మంది ఉంటే సలహాదారులు మాత్రం 50 మంది ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది

మంత్రులు 25.. సలహాదారులు 50

వారి సలహాలతోనే మద్యం, ఇసుక రేట్లు పెంచారా?

సలహాదారుల పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు దుబారా చేస్తోంది: టీడీపీ  


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు 25 మంది ఉంటే సలహాదారులు మాత్రం 50 మంది ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ప్రజాధనాన్ని భోంచేయడం తప్ప ప్రజలకు వారి వల్ల వీసమెత్తు ప్రయోజనం ఉన్నట్లు కనిపించడం లేదని టీడీపీ విమర్శించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇంత మంది సలహాదారులను పెట్టుకున్నా ప్రతి విషయంలో కోర్టులో మొట్టికాయలు ఎందుకు తింటున్నారు? నిధుల సమీకరణ కోసం సీఎం ప్రత్యేకంగా సుభాశ్‌ చంద్ర అనే సలహాదారును పెట్టుకొన్నారు. ఆయన ఏం సలహాలు ఇచ్చారు? ఎవరు సలహాలు ఇచ్చారని మద్యం, ఇసుక రేట్లు విపరీతంగా పెంచారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. ‘‘జగన్‌ సొంత మీడియాలో పనిచేసిన అనుభవం ఉంటే చాలన్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి, అమర్‌, శ్రీరాం, కృష్ణమోహన్‌ తదితరులను వైసీపీ ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది. తన సామాజిక వర్గం వారిని సలహాదారుల పేరుతో ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో నింపారు. వీరు ఎప్పుడైనా ఆయా శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారా? ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఏదైనా తీసుకొన్నారా?’’ అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వని ప్రభుత్వం.. సలహాదారుల పేరుతో రూ.కోట్లు దుబారా చేస్తోందని అశోక్‌బాబు విమర్శించారు.

Updated Date - 2021-07-25T07:46:34+05:30 IST