నగర అభివృద్ధి, సమస్యలపై మంత్రి సమీక్ష
ABN , First Publish Date - 2020-08-15T10:25:18+05:30 IST
కరీంనగర్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుతీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర బీసీ సంక్షేమ,
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, ఆగస్టు 14: కరీంనగర్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుతీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరా శాఖల మంత్రి గంగుల కమలాకర్ నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. స్మార్ట్సిటీ పథకం పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. నగరంలో 80శాతం ప్రాంతాలకే రోజూ నీటి సరఫరా జరుగుతోందని, మిగిలిన 20శాతం కూడా సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఇక స్మార్ట్సిటీ రోడ్లతోపాటు అంతర్గత రోడ్లు, ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని అన్నారు. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పేదింటి పెళ్లిళ్లలకు మేనమమగా సీఎం..
పేదింటి పెళ్లిళ్లకు మేనమామగా సీఎం అండగా ఉంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 240మంది లబ్ధిదారులకు 2,37,55,492 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా మహిళలకే అగ్ర తాంబూలం అని తెలిపారు. పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను నాలుగైదు రోజుల్లో క్లియర్ చేస్తామని అన్నారు. మేయర్ సునీల్ రావు, కమిషనర్ వల్లూరి క్రాంతి, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి పాల్గొన్నారు.