ధరణి ద్వారానే ‘నాలా’
ABN , First Publish Date - 2020-10-14T06:49:44+05:30 IST
వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలకు వినియోగించుకోవడానికి అవసరమైన ‘భూమార్పిడి(ల్యాండ్ కన్వర్షన్)’ విధానంలో మార్పు తెచ్చామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ..
ఆర్డీవోల నుంచి భూ మార్పిడి అధికారాల తొలగింపు
టైమ్ స్లాట్ కేటాయించేది తహసీల్దార్లే
‘నాలా’ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం
రిజిస్ట్రేషన్ విలువల తగ్గింపు అధికారాలకు చెక్
స్టాంపుల చట్టం సెక్షన్ 47(ఎ)కు సవరణ
ఐజీకి విచక్షణాధికారాలు ఉండవు
అప్పీల్ చేసుకోవడానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలకు వినియోగించుకోవడానికి అవసరమైన ‘భూమార్పిడి(ల్యాండ్ కన్వర్షన్)’ విధానంలో మార్పు తెచ్చామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. భూమార్పిడి పత్రాలిచ్చే అధికారాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారు(ఆర్డీవో)ల నుంచి తొలగిస్తూ ‘నాలా’ చట్టంలో సవరణ తెస్తున్నామన్నారు. భూమార్పిడి పత్రాలను ఇక మీదట ‘ధరణి’ పోర్టల్ ద్వారానే జారీ చేస్తామని చెప్పా రు. సీఎం కేసీఆర్ తరఫున మంగళవారం శాసనసభలో ‘తెలంగాణ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్-అగ్రికల్చరల్ పర్పసెస్ - నాలా(సవరణ) బిల్లు-2020’ను మంత్రి ప్రవేశపెట్టారు.అనంతరం బిల్లు సభ ఆమోదం పొందింది. అంతకుముందు బిల్లు ముఖ్య ఉద్దేశాలను సభలో ఆయన వివరించారు. భూమార్పిడి విధానాన్ని సీఎం కేసీఆర్ సులభతరం చేశారని చెప్పారు. భూ మార్పిడి కోసం ‘ధరణి’ పోర్టల్లోనే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ‘‘ఈ-దరఖాస్తులను తహసీల్దారు పరిశీలించి టైమ్ స్లాట్ ఇస్తారు.
ఆ టైమ్లో తహసీల్దార్, దరఖాస్తుదారుడి సమక్షంలోనే భూమార్పిడి జరిగిపోతుంది. అదే రోజు వ్యవసాయేతర ఆస్తికి సంబంధించి తాత్కాలికంగా ఈ-పా్సబుక్ జారీ అవుతుంది. దరఖాస్తుదారుడికి ఇబ్బంది లేకుండా పారదర్శక సేవలు అందుతాయి’’ అని మంత్రి వివరించారు. భూమార్పిడి కోసం 3 నెలల్లోగా దరఖాస్తు చేసుకున్న వారికి జరిమానా మినహాయింపు ఇస్తామన్నారు. ఒక్కోరోజు వచ్చిన దరఖాస్తులను బట్టి పరిష్కారాలుంటాయని మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేవాదాయ, వక్ఫ్ భూముల మార్పిడికి అవకాశం లేదని ఆయన చెప్పారు. కాగా, భూముల సర్వేకు సంబంధిం చి పరిష్కారం ఇప్పుడే సాధ్యం కాదని, భూవివరాలను సరిదిద్దడానికి ఏడాది లేదా రెండేళ్లు పట్టొచ్చని మంత్రి ప్రశాంత్రెడ్డి వివరించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇప్పటికే 1.48 కోట్ల ఎకరాల భూముల వివరాలను సరిదిద్ది ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేశామన్నారు. అంటే 95ు భూముల మార్పిడికి ఇబ్బంది ఉండదని తెలిపారు. కోర్టు కేసులు, అన్నదమ్ముల వివాదాస్పద భూములు.. ఇలాంటి వాటిని పరిష్కరించాలంటే సమయం పడుతుందని అన్నారు.