ఏకతాటిపైకి వస్తే పీఠాధిపతిని రేపే ప్రకటిస్తాం: మంత్రి వెల్లంపల్లి
ABN , First Publish Date - 2021-06-19T00:50:37+05:30 IST
బ్రహ్మంగారి కుటుంబసభ్యులందరూ ఏకతాటిపైకి వస్తే పీఠాధిపతిని రేపే ప్రకటిస్తామని మంత్రి వెల్లంపల్లి
కడప: బ్రహ్మంగారి కుటుంబసభ్యులందరూ ఏకతాటిపైకి వస్తే పీఠాధిపతిని రేపే ప్రకటిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బ్రహ్మంగారి కుటుంబీకులతో పీఠాధిపతి నియామకంపై చర్చించామని ఆయన తెలిపారు. అందరిని ఐక్యమత్యంగా ఉండాలని చెప్పామని, అందరిలోనూ సానుకూలత కనపించిందని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. మఠం ఖ్యాతిని కాపాడాలని వారికి చెప్పామన్నారు. కుటుంబీకులందరూ ఒకతాటిపైకి వస్తారన్న విశ్వాసముందన్నారు. పీఠాధిపతి వ్యవహారంలో లబ్ధి పొందాలని దయచేసి ఎవరూ చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము పీఠాధిపతులను ఎవరినీ మఠానికి పంపలేదని, మఠాధిపతులది సూచన మాత్రమే అని ఆయన తెలిపారు. పీఠాధిపతి నియామకానికి సంబంధించి ఎలాంటి గడువు లేదని, అందరూ ఏకతాటిపైకి వస్తే రేపే పీఠాధిపతిని ప్రకటిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.