మాస్క్ ఉన్నవారినే దేవాలయాల్లోకి అనుమతిస్తాం: వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-06-06T19:19:35+05:30 IST

విజయవాడ: లాక్‌డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా కేంద్రం దేవాలయాలు తేవరడానికి అనుమతులు ఇచ్చిందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

మాస్క్ ఉన్నవారినే దేవాలయాల్లోకి అనుమతిస్తాం: వెల్లంపల్లి

విజయవాడ: లాక్‌డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా కేంద్రం దేవాలయాలు తేవరడానికి అనుమతులు ఇచ్చిందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్‌లో దేవాలయాలు ఉంటే అక్కడికి భక్తులను అనుమతించబోమన్నారు. క్యూ లైన్‌లో భక్తులందరూ కచ్చితంగా 6 అడుగుల దూరం పాటించాలని వెల్లంపల్లి సూచించారు. మాస్క్ ఉన్నవారినే దేవాలయాల్లోకి అనుమతిస్తామన్నారు. దేవాలయాల ఎంట్రన్స్‌లోనే వచ్చే భక్తులకు థర్మల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలయాల ప్రాంగణాలలో ఉమ్మి వేయడం నిషిద్ధమన్నారు.


ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని దేవాలయాల ఉద్యోగులు, స్థానికులతో ట్రైల్ రన్ నిర్వహిస్తామన్నారు. 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరి భక్తులను నియమ నిబంధనల ప్రకారం దర్శనానికి అవకాశం ఇస్తామన్నారు. కేశ ఖండనశాల, భక్తుల అన్నదానానికి సంబంధించి దేవాలయాలలో ఉన్న పరిస్థితులను బట్టి ఆ ఆలయ అధికారులే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆలయాల్లో శఠగోపం, తీర్ధ ప్రసాదాలు ఉండవన్నారు. భక్తులందరూ కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ దేవాలయంలోనూ అంతరాలయానికి అనుమతి లేదని వెల్లంపల్లి తెలిపారు.

Updated Date - 2020-06-06T19:19:35+05:30 IST