నాలాలపై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తాం: మంత్రి Talasani
ABN , First Publish Date - 2022-04-04T17:54:54+05:30 IST
వరద ముంపుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న నాలాలపై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: వరద ముంపుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న నాలాలపై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నగరంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన నాలాల అభివృద్ధి పనులు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుండి వచ్చే వరదతో నాలా పరిసర కాలనీలు, బస్తీలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వరదలు వచ్చిన సమయాలలో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శాశ్వత చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేస్తామని... ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.