రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ –మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-12-06T23:45:51+05:30 IST

ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో చేపట్టిన రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ –మంత్రి తలసాని

హైదరాబాద్: ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో చేపట్టిన రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఒకటి, రెండు ప్రాంతాలలో నిబంధనలను పాటించడంలేదని పిర్యాదులు వచ్చిన నేపధ్యంలో మత్స్య శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు. 

 

2017-18 సంవత్సరంలో ప్రారంభించిన రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొదటగా 11 నీటి వనరులలో కోటి 8 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. వీటితో 7,783 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగిందని, దీని విలువ సుమారు 171 కోట్ల రూపాయలు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచినీటి వనరులలో ఉత్పత్తి చేస్తున్న రొయ్యలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో బాగా డిమాండ్ ఉండటంతో ఏటేటా నీటి వనరులు, విడుదల చేసే రొయ్య పిల్లల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నట్లు పేర్కొన్నారు. 2020-21 సంవత్సరంలో 4.15 కోట్ల రొయ్య పిల్లలను 90 నీటి వనరులలో విడుదల చేయగా, 381 కోట్ల రూపాయల విలువైన 11,734 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగినట్లు చెప్పారు. 


ఈ సంవత్సరం రొయ్యల పెంపకానికి అనుకూలంగా ఉన్న 313 నీటి వనరులలో 10 కోట్ల రొయ్య (నీలకంట) పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన రొయ్య పిల్లలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 140 నీటి వనరులలో 5.34 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందని వివరించారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్, నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండ భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్య పిల్లల నాణ్యత, లెక్కలలో నిబంధనలు పాటించలేదన్న పిర్యాదులు వస్తున్నాయని, ఇవి పునరావృతం కాకుండా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిని ఉపెక్షిన్చావద్దని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-06T23:45:51+05:30 IST