పాలసేకరణలో ఇబ్బందులు రాకుండా చర్యలు-తలసాని
ABN , First Publish Date - 2020-03-26T23:52:31+05:30 IST
రాష్ట్రంలో పాలసేకరణ, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు
హైదరాబాద్: రాష్ట్రంలో పాలసేకరణ, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి లాక్డౌన్ అమలు జరుగుతోందన్నారు. గురువారం పాలసేకరణ, సరఫరా పై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువులైన పాలు, పాల పదార్ధాల పంపిణీకి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిరంతరాయంగా పాల సరఫరా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. పాల సేకరణకు గ్రామాలకు వె ళ్లే వాహనాలను పలు గ్రామాల్లోని ప్రజలు అనుమతించడం లేదని, పాల సేకరణకు సహకరించేలా స్థానిక ప్రజా ప్రతినిదులు ,పాల సంఘాల అధ్యక్షులు చొరవ తీసుకోవాలని సూచించారు. పాల సరఫరా చేసే వాహనాలకు ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను ఆదేశించాలని సీఎస్కు సూచించామన్నారు. పశుసంపద ఆరోగ్యపరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. పశువులదాణా, కోడిగుడ్లు, చేపలు రవాణా వాహనాలకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.