మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు: తలసాని
ABN , First Publish Date - 2022-02-28T21:14:34+05:30 IST
విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్: విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నూతనంగా బిఓటీ పద్దతిలో నిర్మించిన అత్యాధునిక టాయిలెట్స్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంఎల్ఏ సాయన్న లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు లక్షలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ వద్ద మొట్టమొదటగా వాటర్ లెస్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు.
నగరంలోని మరిన్ని ప్రాంతాలలో జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఇలాంటి మోడరన్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజలు కూడా జీహెచ్ఎంసి ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా స్వచ్ఛ హైదరాబాద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రహదారుల అభివృద్ధి, విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం, సీవరేజ్, త్రాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, మోడరన్ టాయిలెట్స్ నిర్వహకులు రంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.