పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-01-20T21:42:46+05:30 IST

విశ్వనగరంగా ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్: విశ్వనగరంగా ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం పంజాగుట్ట లో 17 కోట్ల రూపాయల వ్యయంతో పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగి పోతాయని చెప్పారు. పాత గేట్ నుండి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున  నాగార్జున సర్కిల్ నుండి కే.బి.అర్ పార్క్ జంక్షన్ కు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా ప్రయాణం కొనసాగుతుందని వివరించారు.  


గ్రేవ్ యార్డ్ కు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం జీహెచ్ఎంసి నుండి 17 కోట్ల రూపాయలను మంజూరు చేసి స్టీల్ బ్రిడ్జి నిర్మించినట్టు చెప్పారు. ఇందులో మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లై ఓవర్  మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేసినట్లు వివరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు పర్యవేక్షణలో హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నూతనంగా అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణం, పుట్ పాత్ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయని వివరించారు. 


అనేక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య ను పరిష్కరిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వీటితో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవ తో దేశంలోని ఇతర నగరాల కన్నా హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి, సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T21:42:46+05:30 IST