అభివృద్ధి,సంక్షేమ పధకాలను కార్పొరేటర్లే ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2021-12-15T23:51:54+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన గురుతర బాధ్యత జీహెచ్ఎంసి కార్పొరేటర్ ల పైనే ఉన్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అభివృద్ధి,సంక్షేమ పధకాలను కార్పొరేటర్లే ప్రజల్లోకి తీసుకెళ్లాలి

హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన గురుతర బాధ్యత జీహెచ్ఎంసి కార్పొరేటర్ ల పైనే ఉన్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని అధ్యక్షతన నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ ల సమావేశం జరిగింది.  


ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసి పరిధిలో కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్దిని సాధిస్తూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని, ట్రాఫిక్ ను తట్టుకునేందుకు గాను నూతనంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి లు, అండర్ పాస్ ల నిర్మాణం, అనేక చోట్ల రహదారుల విస్తరణ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 


వర్షాకాలం లో వచ్చే వరద ముంపును నివారించేలా పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులను చేపట్టి ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. మురికినీటి శుద్ధి కోసం సీవరేజీ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ఒకేసారి 3 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసి పరిధిలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ నెల 18 వ తేదీన జరిగే జీహెచ్ఎంసి జనరల్ బాడీ మీటింగ్ సమావేశం వేదికగా చేసుకొని ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్స్ కు పిలుపునిచ్చారు.కార్పొరేటర్ లు తమ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలని సూచించారు. 


ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు,ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎగ్గే మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సుభాష్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, అరికేపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T23:51:54+05:30 IST