పశు వైద్యుల మనోభావాలను మేనకా గాంధీ దెబ్బతీశారు: తలసాని

ABN , First Publish Date - 2021-06-24T00:40:34+05:30 IST

పశువైద్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పార్లమెంట్ సభ్యురాలు మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు.

పశు వైద్యుల మనోభావాలను మేనకా గాంధీ దెబ్బతీశారు: తలసాని

హైదరాబాద్: పశువైద్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పార్లమెంట్ సభ్యురాలు మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఆగ్రా లో ఒక పశు వైద్యుడిని ఎంపి మేనకాగాంధీ దుర్బాష లాడటం పట్ల అఖిల భారత పశువైద్య సంఘం పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వినతిపత్రాన్ని అందజేశారు. సంబంధిత పశువైద్యాధికారి ఏదైనా తప్పు చేసి ఉంటే అఖిల భారత పశువైద్య మండలి దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులు ప్రజాజీవితంలో పేదలకు జీవనాధారమైన జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న పశు వైద్యుల పట్ల మరింత గౌరవాన్ని ప్రదర్శించాల్సి ఉండగా, వారి మనోభావాలు తినే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.


రాబోయే కాలంలో ఇటువంటి చర్యలకు పాల్పడితే పశువైద్య లోకం తీవ్రంగా స్పందిస్తుందనే విషయాన్ని గ్రహించాలని మంత్రి అన్నారు. గతంలో కూడా అనేక సందర్బాలలో ఇదే విధమైన చర్యలకు పాల్పడ్డారని అఖిల భారత పశువైద్య సంఘం జోనల్ సెక్రెటరీ డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ మంత్రికి వివరించారు. మేనకాగాంధీ బేషరతుగా పశువైద్యులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా పశువైద్యుల సంఘం ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీనివాసులు, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ సంఘం ప్రతినిధులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ లక్ష్మి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-06-24T00:40:34+05:30 IST