ప్రతిభ గల క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి?
ABN , First Publish Date - 2022-09-20T09:37:45+05:30 IST
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ తయారీపై రెండేళ్లుగా కుస్తీ పడుతున్న రాష్ట్ర క్రీడాశాఖ ఎట్టకేలకు వేగం పెంచింది.
ముసాయిదా క్రీడా పాలసీ సమీక్షలో పలు అంశాలపై చర్చ
పాల్గొన్న గోపీచంద్, గగన్ నారంగ్, ముఖేష్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ తయారీపై రెండేళ్లుగా కుస్తీ పడుతున్న రాష్ట్ర క్రీడాశాఖ ఎట్టకేలకు వేగం పెంచింది. సోమవారం ముసాయిదా స్పోర్ట్స్ పాలసీపై క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో సమావేశం జరిగింది. తొలుత సమావేశానికి రావాల్సిందిగా మీడియాకు సమాచారం ఇవ్వగా, తర్వాత సమావేశం రద్దయిందని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. అయితే, ముందస్తు షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంలో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపియన్ గగన్ నారంగ్, జాతీయ హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్, అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత సమావేశాల మాదిరిగా కాకుండా ఈసారి భేటీలో నిర్మాణాత్మక చర్చ జరిగిందని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్షి్ప, వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఎంపిక పరీక్షలు లేకుండా ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా సమావేశానికి హాజరైన క్రీడా ప్రముఖులు సూచించారు. అలాగే కేంద్ర క్రీడా పురస్కారాలు అందుకొని, కెరీర్ ముగించిన మాజీలకు కొన్ని రాష్ట్రాల్లో గౌరవ ఫించన్లు ఇస్తున్నారని వాటిని కూడా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రణాళికాబద్ధమైన కోచింగ్ వ్యవస్థ, తగిన సంఖ్యలో కోచ్ల నియామకం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చించారు. క్రీడా ప్రముఖులు తెలియజేసిన అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో అందించాక ముసాయిదా పాలసీలో వాటిని కూడా చేర్చి త్వరలోనే ప్రభుత్వం ముందు ఉంచనున్నారు.