హైదరాబాద్ అంటేనే భరోసా: మంత్రి శ్రీనివాస్

ABN , First Publish Date - 2022-01-31T22:26:27+05:30 IST

దేశంలోనే హైదరాబాద్ అంటేనే ఓ భరోసా అని ఎక్సైజ్ శాఖా మంత్రి

హైదరాబాద్ అంటేనే భరోసా: మంత్రి శ్రీనివాస్

హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్ అంటేనే ఓ భరోసా అని ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని హరిత హోటల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో లా అండ్ అర్డర్ కంట్రోల్‌లోనే ఉందన్నారు. ఏడు సంవత్సరాలుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ, ఆంక్షలు విధించలేదన్నారు. ఒడిశా ఏపీలలో గంజాయి ఎక్కువ సాగు చేస్తున్నారన్నారు. అక్కడి నుంచి గంజాయి కొని కొంతమంది హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి అరెస్టు చేసి పీడీ యాక్టులు పెడుతున్నామన్నారు. వివిధ రకాల మార్గాల్లో, వివిధ రకాల పేర్లతో నగరంలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ గాంజా డ్రగ్స్ దందా నడిచినా ఉక్కుపాదం మోపమని సీఎం చెప్పారని ఆయన తెలిపారు. ఎక్కువగా పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఉందని, అది తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పబ్బులో డ్రగ్స్‌తో పట్టుబడితే వారి వెనకాల ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగదారుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నా వారిని కూడా వడలవద్దని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన పేర్కొన్నారు. పబ్బుల్లో యజమానులు డ్రగ్స్ వాడకం దృష్టి పెట్టాలని, జాగ్రత్తగా గమనించాలని ఆయన సూచించారు. ఎక్సైజ్ అండ్ పోలీస్ జాయింట్ టీం ఎప్పటికప్పుడు పబ్బులను పర్యవేక్షిస్తూ ఉంటుందని ఆయన తెలిపారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడకం వెలుగులోకి వస్తే ఆ పబ్బులను నిరభ్యంతరంగా సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. 


డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయన్నారు. అంతేగాని పబ్బులో డ్రగ్స్ అమ్మి సంపాదిస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ అమ్మినా తమ డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకోలేరన్నారు. పబ్బులో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. డ్రగ్స్‌పై ఫిర్యాదులు చేయడానికి, హెచ్చరించడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కనిపించేలా పెట్టాలన్నారు. కొందరు పబ్బుల్లో అక్రమ దందాలు చేస్తున్నారని తమకు సమాచారం వచ్చిందన్నారు. పబ్స్‌కు వచ్చిన వారు ఎన్ని సిగరేట్లు తాగుతున్నారు. ఒక సిగరెట్‌ను మరో నలుగురు పంచుకుంతున్నారా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. పబ్బుల్లో  విచ్చలవిడిగా సౌండ్స్ పెడుతున్నారని, వాటిని సరి చేసుకోవాలన్నారు. పక్కన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిమితికి లోబడి సౌండ్స్ సిస్టమ్స్ పెట్టాలని ఆయన సూచించారు. 


పబ్బులపై పర్యవేక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నట్టు అనుమానం వస్తే వెంటనే వారి వివరాలను తమకు ఇవ్వాలన్నారు. వెంటనే పోలీసులు స్పందించి వారిని అదుపులోకి తీసుకుంటారని ఆయన తెలిపారు. మీ కొడుకులే ఈ డ్రగ్స్‌కు అలవాటు పడితే మీరు ఎంకరేజ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మీ దృష్టి వస్తే 18004252523 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని ఆయన సూచించారు. 


Updated Date - 2022-01-31T22:26:27+05:30 IST