హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వందల వేల సంవత్సరాలుగా కొనసాగిస్తూ, ప్రజల ఆరోగ్యం కాపాడే పానీయంగా ఉన్న నీరా, కల్లును హైదరాబాద్ నగరంలో నిషేధించి అవమానపరిచారని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీరా పానీయంలో 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధగుణాలు కలిగిన పానీయమన్నారు. గీత వృత్తిని, వృత్తిదారులను కించ పరిచేలా వ్యాఖ్యలుచేస్తున్న కొంత మంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుల సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరుగున పడిపోతున్న కుల, చేతి వృత్తుల కు పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో విలువైన నెక్లెస్ రోడ్డు లో 25 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామన్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
బుధవారం ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా 'నీరా కేఫ్' పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఆబ్కారీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారుల తో కలసి పరిశీలించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నీరా ఉత్పత్తికి ప్రాథమికంగా యాదాద్రి భువనగిరి జిల్లా లోని నందనం గ్రామంలో, సంస్థాన్ నారాయణ పురం మండలం సర్వేలు గ్రామంలో, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మునిపల్లి గ్రామంలో, రంగారెడ్డి జిల్లా లోని అమనగల్లు మండలం చరికొండ గ్రామంలో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు.
గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే ఎక్స్గ్రేషియా ను రైతు బంధు తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆత్మ గౌరవ భవనాల ను నిర్మిస్తున్నామన్నారు. కుల, చేతి వృతుల పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండి మనోహర్, ఉప్పల్ ఆర్టీవో పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలరాజు గౌడ్, చింతల మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి