మరో మూడు ఆలయాల్లో నిత్యాన్నదానం

ABN , First Publish Date - 2022-07-03T12:49:12+05:30 IST

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం రామనాథస్వామి, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి, మదురై మీనాక్షి అమ్మవారి దేవస్థానాల్లో రోజంతా

మరో మూడు ఆలయాల్లో నిత్యాన్నదానం

                              - Minister Shekarbabu


అడయార్‌(చెన్నై), జూలై 2: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం రామనాథస్వామి, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి, మదురై మీనాక్షి అమ్మవారి దేవస్థానాల్లో రోజంతా అన్నదానం చేసే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని దేవాదాయ శాఖామంత్రి పి.శేఖర్‌బాబు తెలిపారు. నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2021-22లో అసెంబ్లీలో తమ శాఖ తరఫున ప్రకటించిన పథకాలకు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రసంగం సమయంలో 165 ప్రకటనలు చేశామని, వాటిలో చాలామేరకు ఇప్పటికే అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు దేవాలయాల్లో రోజంతా అన్నదానం చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ పథకం విస్తరణ చర్యల్లో భాగంగా, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం, మదురై మీనాక్షి ఆలయాల్లో త్వరలోనే అమలు చేయనున్నట్టు వెల్లడించారు. మరో పది ఆలయాల్లో అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నామని, ఈ పథకాన్ని ఈ ఏడాది మరో ఐదు ఆలయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. 121 ఆలయాల్లో పెంచుతున్న గోవులను రూ.20 కోట్లతో సంరక్షిస్తామని మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. 

Updated Date - 2022-07-03T12:49:12+05:30 IST