మాకంతా సమానులే

ABN , First Publish Date - 2022-06-07T12:43:17+05:30 IST

రాష్ట్రంలో ఆస్తికులు, నాస్తికులను సమానంగా భావించే ద్రావిడ తరహా పాలనే జరుగుతోందని, ఆలయ వ్యవహారాల్లో అక్రమాలు, భక్తులకు సమస్యలు తలెత్తినప్పుడే తాము జో

మాకంతా సమానులే

- ఆస్తికులను, నాస్తికులను వేర్వేరుగా చూడం  

- మంత్రి పీకే శేఖర్‌బాబు


చెన్నై, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆస్తికులు, నాస్తికులను సమానంగా భావించే ద్రావిడ తరహా పాలనే జరుగుతోందని, ఆలయ వ్యవహారాల్లో అక్రమాలు, భక్తులకు సమస్యలు తలెత్తినప్పుడే తాము జోక్యం చేసుకుంటున్నామని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఆయన చిదంబరం నటరాజస్వామివారి ఆలయాన్ని దర్శించారు. ఆ సందర్భంగా దీక్షితార్లతో సమావేశమయ్యారు. దీక్షితార్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో నటరాజస్వామివారి ఆలయంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాల గురించి వారితో చర్చించారు. ఆ తర్వాత మంత్రి శేఖర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... చిదంబరం ఆలయంలో కనకసభ వేదికపై నుంచి స్వామివారిని దర్శించుకున్నానని, దీక్షితార్లు తనను ఆలయంలోని అన్ని సన్నిధులకు తీసుకెళ్ళి దర్శనం చేయించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో దీక్షితార్లతో కలిసి కూర్చుని వారి సమస్యలు తెలుసుకున్నానని, ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలిగినందువల్లే తమ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిపించామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ధీక్షితారులు, ఆలయ భక్తులు మెచ్చుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఏ ఆలయంలోనూ భక్తులకు ఇబ్బంది కలుగకూడదనే ముఖ్యమంత్రి స్టాలిన్‌ భావిస్తున్నారని, ఆ మేరకే తాను అన్ని ఆలయాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నట్టు తెలిపారు. థిల్లై గోవిందరాజ పెరుమాళ్‌ ఆలయంలో జీర్ణోద్ధరణ, కుంభాభిషేకం నిర్వహణ గురించి దీక్షితార్లతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన ప్రకటించారు.  

Updated Date - 2022-06-07T12:43:17+05:30 IST