మాది ఆధ్యాత్మిక ప్రభుత్వం: మంత్రి

ABN , First Publish Date - 2022-04-20T14:24:59+05:30 IST

ఆలయాలను సంరక్షించడంలోను, వాటికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టడంలోనూ, కుంభాభిషేకాలను సకాలంలో నిర్వహించడంలో డీఎంకే ప్రభుత్వం తగు చర్యలు చేపడుతూ

మాది ఆధ్యాత్మిక ప్రభుత్వం: మంత్రి

చెన్నై: ఆలయాలను సంరక్షించడంలోను, వాటికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టడంలోనూ, కుంభాభిషేకాలను సకాలంలో నిర్వహించడంలో డీఎంకే ప్రభుత్వం తగు చర్యలు చేపడుతూ ఆధ్యాత్మిక ప్రభుత్వంగా మారుతోందని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు అన్నారు. శాసనసభలో మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ఆలంకుళం శాసనసభ్యుడు మనోజ్‌ పాండ్యన్‌ కీళ్‌కడయం ప్రాంతంలోని భద్రకాళి అమ్మన్‌ ఆలయంలో అన్నదానకూటం ఏర్పాటు చేస్తారా? మునుపటి అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో అమలు చేసిన ఆలయాలల్లో అన్నదాన పథకంలో నాణ్యమైన భోజనం సరఫరా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి శేఖర్‌బాబు బదులిస్తూ కీల్‌కడయం భద్రకాళి అమ్మన్‌ ఆలయంలో ఈ యేడాదిలోపున అన్నదాన కూటం నిర్మించనున్నట్లు తెలిపారు. పద్నాలుగేళ్ల తర్వాత ఆ ఆలయానికి కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 341 ఆలయాల్లో 75 వేలమంది భక్తులకు అన్నదానం చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి భక్తుల ఆకలిని తీర్చటంతోపాటు వారిలో దైవభక్తిని కూడా పెంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రశంసలందుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 666 ఆలయాల్లో జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయని, కబ్జాకు గురైన ఆలయభూములను, పరాధీనంలో ఉన్న ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆలయాలకు ఆర్థిక పరిపుష్టిని కూడా కలిగిస్తున్నామని తెలిపారు. ఆలయాలను సంరక్షించి డీఎంకే ప్రభుత్వం ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రభుత్వంగా మారిందనటం అతిశయోక్తి కాదని అధికారపక్ష శాసనసభ్యుల హర్షధ్వానాల మధ్య ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-04-20T14:24:59+05:30 IST