రైతే రాజుగా రాష్ట్ర పాలన: మంత్రి సత్యవతి
ABN , First Publish Date - 2020-05-28T11:13:38+05:30 IST
రైతే రాజుగా వర్ధిల్లేలా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
బయ్యారం, మే 27 : రైతే రాజుగా వర్ధిల్లేలా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారం మండలం గౌరారంలో బుధవారం నియంత్రిత సాగు విధానం- లాభసాటి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన మం త్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి మేలు జరగాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానంపై దృష్టి సారించినట్లు తెలిపారు. కరోనాతో రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్ధేశంతో రూ.25వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీతారామ, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ను బయ్యారం, కంబాలపల్లి చెరువులకు అనుసందానం చేస్తూ ప్రతి ఎకరాకు నీరందించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎ.బిందు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ అని, ఇలాంటి సీఎం ఉండటం నిజంగా అదృష్టమన్నారు. కలెక్టర్ వీపీ గౌత మ్ మాట్లాడుతూ.. రైతు పంట పండించడానికి కావాల్సిన వనరులు, వసతులను ప్రభుత్వమే సమకూర్చుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి చత్రునాయక్, ఆర్డీవో కొమరయ్య, ఎంపీపీ చేపూరి మౌనిక, మండల వ్యవసాయశాఖ అధికారి రాంజీ పాల్గొన్నారు.
మంత్రి పరామర్శ..
మరిపెడ రూరల్(చిన్నగూడూరు): మండలంలోని అనేపురం గ్రామంలో కరోనా పాజిటివ్ సోకిన కుటుంబానికి మంత్రి సత్యవతిరాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎ్స.రెడ్యానాయక్, కలెక్టర్ పీపీ గౌతమ్, ఎస్సీ కోటిరెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, షేక్ అప్జల్ తదితరులు పాల్గొన్నారు.