మహిళలపట్ల పురుషుల ధోరణిలో మార్పు రావాలి
ABN , First Publish Date - 2022-01-20T08:34:10+05:30 IST
: మహిళల పట్ల పురుషుల ధోరణిలో మార్పు రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ తాజాగా పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వమో లేక మహిళా కమిషనో కాపలా ఉండలేవని తెలిపారు...
ప్రతి కుటుంబానికి మహిళా కమిషన్ కాపలా ఉండలేదు
ఉమ్మడి కుటుంబ సంస్కృతి కనుమరుగై
విచ్ఛినమవుతున్న కుటుంబాలు: మంత్రి సత్యవతి
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మహిళల పట్ల పురుషుల ధోరణిలో మార్పు రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ తాజాగా పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వమో లేక మహిళా కమిషనో కాపలా ఉండలేవని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటై సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా బుద్ధభవన్లోని కమిషన్ కార్యాలయంలో బుధవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కమిషన్ను ఆశ్రయించే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించే విధంగా మహిళా కమిషన్ పనిచేస్తోందని ఆమె కొనియాడారు. కేవలం ఏడాది కాలంలోనే మెరుగైన పనితీరుతో తెలంగాణ మహిళా కమిషన్ దేశంలో అగ్ర స్థానం సొంతం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘పురుషుల వైఖరిలో మార్పు రావాలి. స్త్రీని ఒక తల్లిలా, తోబుట్టువులా చూసుకోవాలి. సర్దిచెప్పే పెద్దవారు లేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంత ప్రజలే కాదు, సెలబ్రిటీ జంటలు కూడా విడిపోతున్నారు. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి కనుమరుగుకావడమే ఈ పరిస్థితికి కారణం. మహిళా కమిషన్కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కమిషన్ కలిగించాలి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి’’ అని మంత్రి హితవు పలికారు. ఈ సందర్భంగా.. మహిళా కమిషన్ పనితీరును వివరించే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన గీతానికి సంబంధించిన సీడీని సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు.
పోలీసుల కంటే ముందు మా దగ్గరకు వస్తే మేలు
మహిళా కమిషన్ ఏర్పాటైన ఏడాది కాలంలో అనేక సమస్యల్ని పరిష్కరించామని కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్లడానికంటే ముందుగానే కమిషన్ను ఆశ్రయిస్తే, సమస్య సత్వరమే పరిష్కారం అవుతుందని తెలిపారు. ఏడాదికాలంలో 492 కేసులు వచ్చాయని వాటిలో 70శాతం కేసుల్ని పరిష్కరించామని ఆమె చెప్పారు. ఎక్కువగా గృహహింస కేసులే ఉన్నాయన్నారు. కౌన్సిలింగ్ ద్వారా 52 కేసుల్లో కుటుంబాలు కలిసేలా చేయగలిగామని వివరించారు.