మెడికల్ కళాశాలతో సూపర్ స్పెషాలిటీ వైద్యం
ABN , First Publish Date - 2021-09-16T05:18:14+05:30 IST
మెడికల్ కళాశాలతో సూపర్ స్పెషాలిటీ వైద్యం
33 ప్రభుత్వ కార్యాలయాలతో కలెక్టరేట్ కాంప్లెక్స్
చిన్నారి హత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం..
మంత్రి సత్యవతిరాథోడ్
మహబూబాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల రావడంతో ఈ ప్రాంత ప్రజలకు సూపర్స్పెషాలిటీ వైద్యం అందనుందని రాష్ట్ర గిరిజన, సీ,్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కళాశాల శంకుస్థాపనకు పనులను వేగవంతం చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివా రు సాలార్తండ శివారులో నిర్మించే నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బీసీ కాలనీ సమీపంలో మెడికల్ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడారు. మెడికల్ కళాశాల అనుబంధంగా మంజూరైన నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను ఆర్అండ్బీకి అప్పగించామని, రూ.30 కోట్లతో టెండర్లు కూడా పూర్తయినట్లు చెప్పారు. నర్సింగ్ కళాశాల నిర్మాణాలు పూర్తయ్యాక అందులో మెడికల్ కాలేజీ ప్రారంభించుకుని ఆ తర్వాత మెడికల్ కళాశాల నిర్మాణాలకు శ్రీకారం చుడుతామన్నారు. జిల్లా ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతున్నామని, అందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కాలేజ్, నూతన కలెక్టరేట్ను ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. 33 కార్యాలయాలతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆర్జీలు పెట్టేందుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టి ప్రజల వద్దకు పాలనను తీసుకువచ్చారన్నారు. జిల్లా అభివృద్ధిలో మీడియా సహాకారం అందిస్తూనే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలానికి సంబంధించి ఎవరికి నష్టం జరుగకుండ చూస్తామని స్పష్టం చేశారు.
దుండగుడిని కఠినంగా శిక్షిస్తాం..
సైదాబాద్ సింగరేణికాలనీలో చిన్నారిపై హత్యాచారం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్లో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన నాటి నుంచే అధికారులను అప్రమత్తం చేసి, చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు. రాష్ట్ర డీజీపీ, సీపీలతో మాట్లాడుతూ... ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. దోషిని త్వరితంగా పట్టుకోవడం కోసం 200 మంది పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారని వివరించారు. ఇప్పటికే నిందితుడి కుటుంబసభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారని, దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని న్యాయం చేయడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ శశాంక, జడ్పీచైర్పర్సన్ ఆంగోతు బిందు, ఆర్అండ్బీ ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్ గణపతిరెడ్డి, వాస్తు నిపుణులు సుధాకర్తేజ, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరే్షరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేందర్, ఈఈ తానేశ్వర్, అదనపు కలెక్టర్ కొమురయ్య, అడిషనల్ ఎస్పీ యోగే్షగౌతమ్, తహసీల్దార్ రంజిత్, టీఆర్ఎస్ నాయకులు నూకల శ్రీరంగారెడ్డి, శ్రీధర్రెడ్డి, మూల మధుకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.