కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదల మోములో ఆనందం
ABN , First Publish Date - 2020-10-23T10:25:55+05:30 IST
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల ఎందరో పేదల మొహాల్లో ఆనందాన్ని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు
ఖమ్మంటౌన్, అక్టోబరు 22: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల ఎందరో పేదల మొహాల్లో ఆనందాన్ని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని వీడీవోస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో 106 మంది లబ్ధిదారులకు రూ.1.10 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచి ఇప్పటి వరకు రూ.34కోట్ల 34లక్షల విలువైన చెక్కులను అందచేయటం ఆనందంగా ఉందన్నారు.
శ్మశాన వాటికలతో అసౌకర్యం కలగొద్దు
దహన సంస్కారాలు చేసేందుకు శ్మశానవాటికకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులతో ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి బల్లేపల్లి శ్మశాన వాటిక పనులను పరిశీలించారు.
మాజీమంత్రి నాయని మరణం బాధాకరం
కార్మికనేత, తెలంగాణా రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి మరణం బాధకరమైనదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రితో సహా టీఆర్ఎస్ నేతలు నాయని మృతికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతామధు, మేయర్ జి. పాపాలాల్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్జయంతి, ఈఈ కృష్ణాలాల్, డీఈ రంగారావు, సుడా ఛైర్మన్ విజయ్కుమార్, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నగరఅధ్యక్షుడు కమర్తపు మురళి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.