హత్యాయత్నంపై మంత్రి పేర్ని నాని ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2020-11-29T18:26:13+05:30 IST
సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన సంచలనం సృష్టిస్తోంది. నాగేశ్వరరావు అనే తాపీమేస్త్రీ తాపీతో మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే మంత్రి అనుచరులు వెంటనే అప్రమత్తం అయి అడ్డుకోవడంతో మంత్రి క్షేమంగా బయటపడ్డారు.
మచిలీపట్నం: సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన సంచలనం సృష్టిస్తోంది. నాగేశ్వరరావు అనే తాపీమేస్త్రీ తాపీతో మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే మంత్రి అనుచరులు వెంటనే అప్రమత్తం అయి అడ్డుకోవడంతో మంత్రి క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరించారు.
మంత్రి ఏమన్నారంటే..
‘‘ఈ రోజు మా తల్లిగారి పెద్దకర్మ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాం. పూజలన్నీ పూర్తి చేసుకుని భోజనాల దగ్గరకు వెళ్తున్నా. మా ఇంటివద్దకు ప్రజలు చాలామంది వచ్చారు. వారందరినీ పలకరిస్తూ గేటు దగ్గరకు వచ్చా. అక్కడ ఒకతను తల వంచుకుని కాళ్లకు దండం పెట్టడానికి వస్తున్నట్లుగా ముందుకు వచ్చాడు. దగ్గరకు వచ్చాక చూస్తే.. ఐరన్ది ఏదో పొట్టలో నుంచి తీసి పొడవడానికి ప్రయత్నించాడు. అయితే మొదటి సారి విఫలం అవడంతో రెండో సారి పొడవడానికి ప్రయత్నిస్తుంటే నా చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి పట్టుకున్నారు. అతను ఎందుకిలా చేశాడో నాకు తెలీదు. నేనైతే సురక్షితంగా ఉన్నా. అతను బలరాం పేటకు సంబంధించిన వ్యక్తి. నేను గుర్తు పట్టాను. గన్మెన్లు అతడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. నాకు ఏమీ కాలేదు. ఎవరూ ఆందోళన చెందవద్దు.’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు.