నకిలీ విత్తన తయారీ దారులపై ఉక్కుపాదం:మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-30T23:26:51+05:30 IST

నకిలీ విత్తనాలను విక్రయించడం ద్వారా రైతులను మోసం చేసే తయారీ దారుల పై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

నకిలీ విత్తన తయారీ దారులపై ఉక్కుపాదం:మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: నకిలీ విత్తనాలను విక్రయించడం ద్వారా రైతులను మోసం చేసే తయారీ దారుల పై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య  ఉన్నదని ఆయన అన్నారు.తక్కువ ధరకు విత్తనాలు లభిస్తుండడం మూలంగానే రైతులు నకిలీ విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన అన్నారు. వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో శనివారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా సాగులో ఉండే కలుపు సమస్యను ఎదుర్కోవడానికి గడ్డి మందు కొట్టేందుకు అవకాశం ఉండడంతో కలుపుకూళ్లు తగ్గుతున్నాయని రైతులు నకిలీ విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. 


గడ్డి మందు గ్లైఫో సెట్ అమ్మకాలపై వ్యవసాయ అధికారులు నిఘాపెట్టాలని చెప్పారు.లైసెన్స్  లేకుండా విత్తనాలు అమ్మినా, కాలంతీరిన విత్తనాలను అమ్మినా కఠినచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రైతులు తక్కువ ధరకు వస్తున్నాయన్న ఉద్దేశంతో నకిలీ విత్తనాలను కొనవద్దని మంత్రి రైతులను కోరారు. ఈ ఏడాది పత్తి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నదని మంత్రి తెలిపారు గత ఏడాది వర్షాలు వెనకాముందు కావడం, అధికవర్షాల మూలంగా పెద్దఎత్తున సాగు చేయలేకపోయారు.తనిఖీలలో నిబంధనల మేరకే టాస్క్ ఫోర్స్ టీం వ్యవహరించాలన్నారు. తనిఖీలలో అత్యుత్సాహం ప్రదర్శించడం, తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 


నకిలీ విత్తనాల కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. చట్టంలోని లొసుగులతో దోషులు తప్పించుకోకుండా వెంటనే శిక్షలు అమలయితే నకిలీ విత్తన తయారీదారులలో మార్పు వస్తుందన్నారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి  రఘునందన్ రావు, సీపీలు మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీ నాగిరెడ్డి, ఐజీ డీఎస్ చౌహాన్, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ అనిల్ కుమార్, ఐజీపీ ఇంటలిజెన్స్ రాజేష్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు,  రంగారెడ్డి కలెక్టర్ అమేయ్ కుమార్, సీడ్స్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-30T23:26:51+05:30 IST