తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-25T21:04:46+05:30 IST

సరికొత్త ఆవిష్కరణల ద్వారా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు.

తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: సరికొత్త ఆవిష్కరణల ద్వారా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం హైదరాబాద్ లో వుండడం మనకు గర్వకారణమని అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ లో తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో  అత్యంత కీలకమని అన్నారు.వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమని చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ ఎ ఓ వెల్లడించిందని తెలిపారు. హైదరాబాద్ ను చూసి గర్వపడే పరిస్థితి కేసీఆర్ కల్పించారని మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఐటీరంగం పురోగమిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని,వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామని అన్నారు.


విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నామని, దీనికి మనం గర్వపడాలన్నారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పారు.కాళేశ్వరం ద్వారా ఏటి ఏరును ఎదురెక్కించి మల్లన్న సాగర్ ను నింపిన ఘనత కేసీఆర్ దని చెప్పారు.కోటి ఎకరాలకు పైగా తెలంగాణలో భూములు సాగవుతున్నాయి. పత్తి సగటు దిగుబడిలో దేశంలో అగ్రభాగంలో ఉన్నామని అన్నారు. వరి దిగుబడిలో పంజాబ్ ను తలదన్నినమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో విత్తనరంగం మీద దృష్టి సాధించడం జరుగుతున్నదని చెప్పారు. ప్రపంచంలో 70,80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని, విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం వుందన్నారు. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్ వినియోగం మరింత పెరుగుతుందన్నారు.


Updated Date - 2022-02-25T21:04:46+05:30 IST