ఐదో రోజు రైతు బంధుకు రూ.1047.41 కోట్లు విడుదల: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-03T21:38:02+05:30 IST

రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలుకు నిధుల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఐదో రోజు రైతు బంధుకు రూ.1047.41 కోట్లు విడుదల: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలుకు నిధుల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఐదో రోజున రైతు బంధు కోసం రూ.1047.41 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు. వీటిని 4,89,189 మంది రైతుల ఖాతాలల్లో జమ చేసినట్టు ఆయన తెలిపారు.ఇప్పటి వరకు 57,60,280 మంది రైతులకు రూ.5294.09 కోట్లు పంపిణీ చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. 20,30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఒకప్పుడు తెలంగాణలో కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి వుండేదన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సాగునీటి వసతి కల్పన, వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని చెప్పారు. రూ.50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు వంటి ఒక పథకం కింద రైతులకు అందజేయడం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా జరగలేదని అన్నారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న పట్టుదల, చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనమన్నారు. రైతుభీమా, ఉచితకరంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం ఏటా 60 వేల కోట్లు ఈ రంగానికి ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని అన్నారు.వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును నిలబెట్టిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

Updated Date - 2022-01-03T21:38:02+05:30 IST