రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: Niranjan reddy
ABN , First Publish Date - 2022-07-15T21:04:53+05:30 IST
రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకే ఆయిల్ పామ్ డిమాండ్ గమనించే ప్రోత్సాహంఅందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకే ఆయిల్ పామ్ డిమాండ్ గమనించే ప్రోత్సాహంఅందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్రంలోని 26.81 లక్షల బోరు బావులకు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం మోస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సఫరా చేస్తున్నామని అన్నారు. అలాగే ఏడాదికి రూ.1500 కోట్లు పెట్టి రైతుభీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.ఏడాదికి రూ.15 వేల కోట్లతో 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకంఅమలు చేస్తున్నామన్నారు.
ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈఓల నియామకం, మొత్తం 2601 రైతువేదికల నిర్మాణం జరిగిందన్నారు.ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అని చెప్పారు. దేశంలో ఏటా 23 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల డిమాండ్ ఉన్నదని,కానీ దేశంలో 10, 11 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెలు మాత్రమే దేశీయంగా లభిస్తున్నాయి. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల కోసం దిగుమతుల మీద ఆధారపడుతున్నామని తెలిపారు.
రూ.80 నుండి రూ.90 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం వెచ్చించి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుండి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.ఈ డిమాండ్ ను గమనించే 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఇప్పటి వరకు 30 వేల మంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించామన్నారు.ఒక ఆయిల్ పామ్ మొక్కకు రూ. 193 రాయితి చొప్పున, ఎకరానికి 57 మొక్కలకు రూ . 11,000 రాయితి లభిస్తున్నదని తెలిపారు.మొత్తంగా ఒక ఎకరానికి ఆయిల్ పామ్ తోట సాగుకు రూ. 49,800 రాయితీగా ఇస్తున్నామని తెలిపారు.