68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-06-28T00:04:49+05:30 IST

తెలంగాణలో రైతుబంధు కోసం 68.10 లక్షల మంది అర్హులుగా తేలినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు కోసం 68.10 లక్షల మంది అర్హులుగా తేలినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 28వ తేదీ నుండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమకానున్న నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ దఫా కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు రైతుబంధు సాయం అందనున్నదని తెలిపారు. పంపిణీకి  రూ.7521.80 కోట్లు సిద్ధంగా వున్నాయని తెలిపారు.రోజుకు ఒక ఎకరా నుండి ఆరోహణా క్రమంలో రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టు మంత్రి చెప్పారు.  సీసీఎల్ఎ వ్యవసాయ శాఖకు వివరాలు అందించినట్టు తెలపారు. 


వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందించారని అన్నారు. వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి అంతా సిద్దం చేశామనని తెలిపారు.మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా  వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతుల మీద అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. 


మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని మంత్రి సూచించారు.జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.వర్షాలు కొంత ఆలస్యమయినందున తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటిమీటర్లు, బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదు అయిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలన్నారు.

Updated Date - 2022-06-28T00:04:49+05:30 IST