ప్రజలను బయటకు రానీయకండి: మంత్రి పేర్ని

ABN , First Publish Date - 2020-03-29T09:30:45+05:30 IST

నగర ప్రజలను బయటకు రానివ్వకుండా..

ప్రజలను బయటకు రానీయకండి: మంత్రి పేర్ని

మచిలీపట్నం టౌన్‌(కృష్ణా): నగర ప్రజలను బయటకు రానివ్వకుండా హెచ్చరించాలని ట్రాఫిక్‌ ఎస్సై మస్తాన్‌ఖాన్‌కు మంత్రి పేర్ని నాని సూచించారు. స్థానిక పంపుహౌస్‌ వద్ద మస్తాన్‌ఖాన్‌తో నగరంలో ప్రజలు ఎలా రోడ్లపై వ్యవహరిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ప్రజలపై లాఠీచార్జి చేయడం లేదని, గట్టిగా మందలించి ఇళ్లకు పంపుతున్నామని మస్తాన్‌ఖాన్‌  తెలిపారు.


వేసవిలో తాగునీటికి ఇబ్బందులుండవు

వేసవిలో ప్రజలకు ఏ విధమైన తాగునీటి ఇబ్బందులు ఉండవని మంత్రి పేర్ని నానికి కమిషనర్‌ శివరామకృష్ణ తెలిపారు. శనివారం పంపుహౌస్‌ను సందర్శించిన సందర్భంలో మంత్రి  తాగునీటి సరఫరాపై కమిషనర్‌ శివరామకృష్ణ, ఎంఈ త్రినాథ్‌లను అడిగి తెలుసుకున్నారు.       

  

ట్రాక్టర్‌ నడిపి మందు స్ర్పే చేయించిన మంత్రి పేర్ని

మచిలీపట్నం టౌన్‌: బందరు ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండే లక్ష్యంతో మంత్రి పేర్ని నాని శనివారం ఉదయం మున్సిపల్‌ ట్రాక్టర్‌ నడిపారు. సోడియం హైపో క్లోరైడ్‌ లిక్విడ్‌ను పిచికారీ చేయించారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పిచికారీ చేయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు నుంచి పర్నం సతీష్‌ తీసుకువచ్చిన 25 టన్నుల సోడియం హైపోక్లోరైడ్‌ను వాటర్‌ వర్క్స్‌లో పీపాల్లోకి ఎక్కించారు. ఈ ద్రావణాన్ని ట్రాక్టర్లపై టిన్నుల్లోకి ఎక్కించారు. నూజివీడు మామిడితోటల్లో మందు పిచికారీ చేసే పది వాహనాలను నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు సాయంతో బందరు తీసుకువచ్చారు. కోనేరుసెంటర్‌ నుంచి పిచికారీ ప్రారంభమైంది. 


చేతులెత్తి అడుగుతున్నా...

మంత్రి బందరు కోనేరు సెంటర్‌లో ఒకేసారి వందల మంది గుమిగూడటాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాంతో ‘చేతులెత్తి అడుగుతున్నా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ కఠినంగా పాటించండి. బందరు ప్రజలు స్వీయ నియంత్రణలో మిగిలిన నియోజకవర్గాలకు రోల్‌మోడల్‌గా ఉండాలి. మాధ్యమాల్లో గుమిగూడి ఉన్న బందరు ప్రజలను చూపిస్తున్నారు. అమెరికా, ఇటలీ వంటి చెందిన దేశాలు కరోనాతో అల్లాడిపోతున్నాయి. భారతదేశ ప్రజలు అలాంటి చేదు అనుభవాలకు వెళ్లవద్దు’ అంటూ మంత్రి పేర్ని నాని ప్రజలను కోరారు.               

Updated Date - 2020-03-29T09:30:45+05:30 IST