కరోనా నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2020-04-04T09:26:49+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని ప్రభుత్వశాఖల విభాగాధిపతులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌


విశాఖపట్నం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని ప్రభుత్వశాఖల విభాగాధిపతులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కరోనా తీవ్రత, వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ, గాజువాక, భీమిలి నియోజకవర్గాల పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసులు వెలుగుచూసిన ప్రాంతాలతోపాటు మూడు కిలోమీటర్ల పరిధిలోని నివాసాలను రెడ్‌జోన్‌ గా ప్రకటించామని, అలాగే విదేశాల నుంచి వచ్చినవారు, పాజిటివ్‌ వచ్చినవారితో సన్నిహిత సంబంధాలు కలిగి వున్నవారు నివాసం ఉంటున్న ప్రాంతాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించి పారిశుధ్య నిర్వహణ, స్ర్కీనింగ్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు.


కొంతమంది ఢిల్లీ వెళ్లి రావడం వల్లే కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, అలాంటి వారుగానీ, ఢిల్లీ వెళ్లినవారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవారు కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కేజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను ప్రారంభించామన్నారు. దీని వల్ల ఇకపై వ్యాధి నిర్ధారణకు శాంపిల్స్‌ను కాకినాడ పంపాల్సిన అవసరం ఉండదన్నారు. అంతేకాకుండా సకాలంలో వ్యాధి నిర్ధారణ ఫలితాలు కూడా వచ్చేస్తాయన్నారు. శనివారం నుంచి పేదలకు వెయ్యి రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T09:26:49+05:30 IST