పర్యాటక హబ్గా ఆంధ్రప్రదేశ్
ABN , First Publish Date - 2020-09-27T11:40:17+05:30 IST
అంతర్జాతీయ పర్యాటక హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
- మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
మహారాణిపేట, సెప్టెంబరు 26: అంతర్జాతీయ పర్యాటక హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సర్క్యుట్ హౌస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పర్యాటకాభివృద్ధికి రాష్ట్రంలో తగిన వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. పొడవైన సముద్ర తీరం, సుందరమైన బీచ్లు, అడవులు, కొండలు, విహార స్థలాలు, దేవాలయాలు ఉన్నాయని, వీటి ఆధారంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజంలో పెట్టుబడులు ఆహ్వానించవచ్చునని తెలిపారు. వివిధ పర్యాటక ప్రదేశాల్లో 12 స్టార్హోటళ్లు ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంలో నిర్మించనున్నట్లు చెప్పారు.
నదులు, సరస్సులు, రిజర్వాయర్లలో సురక్షిత బోటు విహారం కోసం 9 కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక యాప్ద్వారా యాత్రికులను చైతన్యపరిచి సందర్శక స్థలాలకు రప్పిస్తామన్నారు. పర్యాటక రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని, ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నందున ఈ రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలకు సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ రాంప్రసాద్, డీవీఎం ప్రసాద్రెడ్డి, టీఐఓ పూర్ణిమదేవి తదితరులు పాల్గొన్నారు.