సీఎం పర్యటన విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-08-06T05:15:22+05:30 IST
జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఈ నెల 11న బాపట్లలో పర్యటిస్తున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
బాపట్లలో 11న జగనన్న విద్యాదీవెన కార్యక్రమం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మేరుగ, కలెక్టర్
బాపట్ల, ఆగస్టు 5: జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఈ నెల 11న బాపట్లలో పర్యటిస్తున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ను, బాపట్ల వ్యవసాయ కళాశాలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో వేదిక ఏర్పాటుకి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. హెలిప్యాడ్ కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో పాటు జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్గ్రౌండ్ను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ కె.విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి మంత్రి ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎం పర్యటన విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీస్పీకర్ కోన రఘుపతి, ముఖ్యమంత్రి టూర్ ప్రోగ్రామ్ కన్వీనర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఆర్డీవో గంధం రవీందర్, మున్సిపల్ కమిషనర్ ఎ.భానుప్రతాప్, అడిషనల్ ఎస్పీ పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష
సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ కె.విజయకృష్ణన్ సమీక్షించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.