నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని కూడా చీల్చి చెండాడండి: KTR

ABN , First Publish Date - 2022-01-10T18:16:33+05:30 IST

దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భం అని మంత్రి కేటీఆర్ అన్నారు.

నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని కూడా చీల్చి చెండాడండి: KTR

హైదరాబాద్: దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భం అని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 65 లక్షల రైతు కుటుంబాలకు 50 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన రోజు అని చెప్పుకొచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబరాలు ఉంటాయన్నారు. ఇదో మహత్తర కార్యక్రమమని... కానీ కొందరు పొలిటికల్ టూరిస్టులు ఇది తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ రైతు ఆత్మహత్యల్లో ఫస్ట్, దిగుబడిలో లాస్ట్ ఉండేదన్నారు. ఉమ్మడి పాలకులు అంతా అన్నం పెట్టిన రైతులకు సున్నం పెట్టినవారే అని మంత్రి విమర్శించారు. ‘‘నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని కూడా చీల్చి చెండాడండి.. నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, ధాన్యం రాసులు.. ఆగమైన రైతు బాగు పడుతున్నడు’’ అని అన్నారు.


రియల్ ఎస్టేట్ దేశం మొత్తం ఒకలా ఉంటే తెలంగాణలో మరోలా ఉందన్నారు. స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ సీఎం ఉండటం వల్లనే అది సాధ్యం అయిందని చెప్పుకొచ్చారు. రైతుబంధును విమర్శిస్తున్న ప్రతీ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్త రైతుబంధు తీసుకున్న వారే అని తెలిపారు. రైతుబంధు తీసుకంటున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల లెక్కలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. పెన్షన్‌ను విమర్శించే నేత తండ్రి కూడా ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే రెండోవిడత రుణమాఫీ పూర్తిగా చేస్తామని స్పష్టం చేశారు. రైతుబంధు స్ఫూర్తితోనే కాలీయా, కృషిబంధు, కిసాన్ సమ్మాన్ పథకాలు తెచ్చారన్నారు. పొలిటికల్ టూరిస్టుల రాష్ట్రాల్లో రైతుబంధు లాంటి స్కీం ఉందా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-01-10T18:16:33+05:30 IST