శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ కిట్స్ పంపిణీ చేసిన కేటీఆర్
ABN , First Publish Date - 2020-07-07T01:09:06+05:30 IST
కరోనా నియంత్రణలో జీహెచ్ఎంసిలోని శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.
హైదరాబాద్: కరోనా నియంత్రణలో జీహెచ్ఎంసిలోని శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. సోమవారం ఫతుల్లాగూడలోని యూనిమల్కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ సేఫ్టీ కిట్స్ను పంపిణీచేశారు. ప్రస్తుతం రూ.13 కోట్ల రూపాయల వ్యయంతో 22వేల మంది శానిటేషన్, మరో 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ కిట్స్ ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్తెలిపారు. కిట్స్ను రెగ్యులర్గా వినియోగించాలని సిబ్బందికి మంత్రి కేటీఆర్ సూచించారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బంది సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం,రక్షణతో పాటు కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్నికాపాడేందుకు ఇంటి వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
గతంలో అత్యవసరంగా 1,80,000 మాస్క్లు, 27వేల హ్యాండ్గ్లోవ్స్, 25వేల లీటర్ల హ్యాండ్శానిటైజర్ను శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందికి సర్కిళ్లవారీగా పంపిణీ చేసినట్టు జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్కుమార్ వివరించారు. మూడు వారాల్లో అందరికీ పిపిఈ కిట్స్ పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా యానిమల్ కేర్ సెంటర్ నిర్వహణను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అదే విధంగా ఎంటమాలజీ విభాగం ఏర్పాటుచేసిన దోమల నివారణ స్టాల్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, మూసీ రివర్ ఫ్రంట్ ఛైర్మన్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గేమల్లేశం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.