కాంగ్రెస్, బిజెపిల ఉమ్మడి అభ్యర్ధి ఈటల: కేటీఆర్
ABN , First Publish Date - 2021-10-23T20:53:54+05:30 IST
కాంగ్రెస్, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్లో పోటీచేస్తున్నారని టీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్లో పోటీచేస్తున్నారని టీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మాటను వారు కాదని చెప్తే, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తానే బయటపెడతానని స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్ , నిజామాబాద్ లోక్సభ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నకల్లో చీకటి ఒప్పందం చేసుకున్నట్టే ఇప్పుడు హుజూరాబాద్లో కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు.
హైటెక్స్ ప్రాంగణంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెన్నికుట్రలుచేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నా హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్యాదవ్ విజయం తథ్యమని అన్నారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. విజ్ఞులైన హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిస్తారని అన్నారు.మాణిక్య ఠాకూర్ పీసీసీ పదవిని 50కోట్లకు అమ్ముకున్నారని సొంత పార్టీనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విమర్శలు చేశారని కేటీఆర్ అన్నారు. అయినా దీనిపై ఆపార్టీ స్పందించలేదన్నారు.