గులాబీ దండు కదలాలి...మన సత్తా ఎంతో మరోసారి చూపాలి
ABN , First Publish Date - 2021-10-23T00:21:36+05:30 IST
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 25న హైదరాబాద్ లో పార్టీ ప్లీనరీ, నవంబర్ 15 న వరంగల్ లో జరగనున్న తెలంగాణ విజయగర్జన సభ సన్నాహాలపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలతో కేటీఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్మన్, ఇతర ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ నవంబర్ 15న వరంగల్ లో జరిగే విజయ గర్జన సభకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు కదలి రావాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ కార్యాచరణ కోసం గ్రామ, మండల స్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని, పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం మరింత విజయవంతంగా ముందుకు వెళ్ళేలా పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు.ఉద్యమ సారధిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన పరిపాలనతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకున్నారని తెలిపారు. ఉద్యమ నేత కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ఎన్నో ప్రతిబంధాకాలను తట్టుకుని ఆయన సారధ్యంలో బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. విజయ గర్జన బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు కదలిరావాలని, విపక్షాలకు... టీఆర్ఎస్ సత్తా ఎంటో మరోసారి చాటి చెప్పాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.