తెలంగాణలో అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నది-మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-04-13T21:47:13+05:30 IST
తెలంగాణలో ప్రస్తుతం అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నదని మున్సిపల్,ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నదని మున్సిపల్,ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయులు అంబేడ్కర్ చూపిన బాటలో నడుస్తూ,వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డిసెంబర్లోగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తమని ప్రకటించారు. హైదరాబాద్ లో నెలకొల్పుతున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదని ఆయన తెలిపారు. ఈ కాంస్య విగ్రహాన్ని 11ఎకరాలలో 150కోట్లతో గొప్పగా ప్రతిష్ఠిస్తున్నమని మంత్రి తెలిపారు. సచివాలయం సమీపాన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి కేటీఆర్ పరిశీలించారు, ఈఎన్సీ గణపతి రెడ్డిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు,పలు సూచనలు,సలహాలిచ్చారు.
ఈ ప్రాంగణాన్ని సుందరంగా,ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, పర్యాటక కేంద్రంగా వర్థిల్లనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంబేడ్కర్ తాను రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.కేసీఆర్ మహోన్నత ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. మహనీయులు అంబేడ్కర్ చూపిన బాటలో కేసీఆర్ నడుస్తూ,వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నయని అన్నారు. దళితబంధు,రైతుబంధు పథకాలు మహత్తరమైనవి,ప్రజలందరి సహకారంతో వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
దాదాపు అన్ని మంచి అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారింది. నగరం నడిబొడ్డున సచివాలయం సమీపాన పీవీ మార్గ్లో ఏర్పాటు చేస్తున్న భారతరత్న రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్ఠిస్తమని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్తో గత 8 నెలలుగా విగ్రహ ఏర్పాటు పనులను ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు,రాత్రిబవళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నయ్.ఈ విగ్రహం ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాలన్నింటిలో అతి పెద్దది.ఇది దేశానికే తలమానికంగా నిలవనున్నదని మంత్రి తెలిపారు. ఇందులో మ్యూజియం,గ్రంథాలయం,ఫోటో గ్యాలరీ,ధ్యాన మందిరం, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు.
ఈ ప్రాంగణాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతం, పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించనున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుడు కలలుగన్నట్టు తెలంగాణలో అన్ని వర్గాల వారికి మరింత మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్,సండ్ర వెంకటవీరయ్య,చిరుమర్తి లింగయ్య,కాలే యాదయ్య, దివాకర్ రావు, క్రాంతి కిరణ్,ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్,ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, స్థానిక కార్పోరేటర్ విజయా రెడ్డి, బి.సి.కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు మహ్మద్ సలీం,రావుల విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.