చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌

ABN , First Publish Date - 2020-08-04T01:33:03+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. ఇవాళ అమరావతిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవాలని సవాల్ విసిరారు. కాగా.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని.. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అధికార పార్టీ వైసీపీకి చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌పై కోడాలి నాని స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకెళ్లి చంద్రబాబు గెలిపించుకోవాలన్నారు. మీరు రాజీనామా చేసి గెలిచిన తర్వాత తమ ప్రభుత్వం మూడు రాజధానులపై పునరాలోచిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. రాజధానిని ఎవరూ మార్చట్లేదని అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందని ఈ సందర్భంగా మరోసారి మంత్రి నాని స్పష్టం చేశారు.


చంద్రబాబు ఏమన్నారు..!?

రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని బాబు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారని ఆయన గుర్తుచేశారు. మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానులను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదన్నారు. ఏపీ రాజధాని ఐదు కోట్ల ప్రజల సమస్య అని చెప్పారు. కులాలు, మతాల సమస్య కాదని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఈ సవాల్‌పై వైసీపీకి 48 గంటలు సమయం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తామందరం రాజీనామా చేస్తామని చెప్పారు.. వైసీపీ కూడా రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-04T01:33:03+05:30 IST