కేసీఆర్కు భయం పట్టుకుంది
ABN , First Publish Date - 2022-05-28T09:36:30+05:30 IST
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రజలు తన కుటుంబ పాలనను వద్దనుకుంటున్నారేమోనన్న భయం కేసీఆర్కు పట్టుకుంది. ఆ
- మోదీని విమర్శించే అర్హత వారికి లేదు
- కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతాం: కిషన్రెడ్డి
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రజలు తన కుటుంబ పాలనను వద్దనుకుంటున్నారేమోనన్న భయం కేసీఆర్కు పట్టుకుంది. ఆ భయంతోనే భూకంపాలు, ప్రళయాలు సృష్టిస్తున్నారు. సంచలనాల పేరిట ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం చెబుతున్న గుణాత్మక మార్పునకు కారణం ఆ భయమే’’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంచలనాలు సృష్టిస్తే తమకేం అభ్యంతరం లేదని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చ డం, ఎడాపెడా అప్పులు చేయడం తప్ప తెలంగాణకు కేసీఆర్ చేసిందేమిటి? అని నిలదీశారు. పెట్రోల్, డీజిల్పై కేంద్రం సుంకాలు తగ్గించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి వ్యాట్ కూడా తగ్గించకపోవడమేనా గుణాత్మక మార్పు అని ధ్వజమెత్తారు. పంచాయతీలకు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది? పేదలకు ఇస్తున్న బియ్యంలో కేంద్రం సబ్సిడీ ఎంత? రాష్ట్రంలో జాతీయ రహదారులను ఇచ్చింది కేంద్రం కాదా? కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సంస్థల సహకారం లేదా? ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. విభజన హామీలపై పదేపదే మాట్లాడుతున్న కల్వకుంట్ల కుటుంబం.. ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయాలని ఆనాడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వమే ఈ ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినట్లు టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్రెడ్డి మండిపడ్డారు. మోదీ నాయకత్వాన్ని విమర్శించే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదన్నారు. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్విస్ కంపెనీతో టైఅప్ చేశామని, వారు తయారు చేసే ప్రతీ కోచ్ను కొనుగోలు చేసేది కేంద్రమే అని కిషన్రెడ్డి చెప్పారు. తానేదో కొత్త కంపెనీ తీసుకొస్తున్నట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మసీదులు తవ్వేద్దామా? అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కిషన్రెడ్డి స్పందిస్తూ.. జ్ఞానవాపిలో ఇటీవల బయటపడ్డ విగ్రహాలకు సంబంధించిన అంశంపైనే ఆయన మాట్లాడారని పేర్కొన్నారు.