ప్రతి ధాన్యం గింజ ఆర్‌బీకేల్లోనే కొనాలి

ABN , First Publish Date - 2022-05-18T06:31:46+05:30 IST

రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

ప్రతి ధాన్యం గింజ ఆర్‌బీకేల్లోనే కొనాలి
మాట్లాడుతున్న మంత్రి కారుమూరి

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
 రాజమహేంద్రవరం, మే 17(ఆంధ్రజ్యోతి) :  రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పౌరసరఫరాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతుకు ఏ ఇబ్బంది రాకూడదన్నారు. దళారులు ఉండకూడదని, మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం డేటాను ఎప్పటికప్పుడు ఎంట్రీ చేయాలని సూచించారు. 21 రోజులలో డబ్బులు రైతు ఖాతాల్లో పడేటట్టు చూడాలన్నారు. జాప్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటికే 10.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. కాకినాడ జిల్లాలో కందిపప్పు ఎక్కువగా తీసుకోవడం లేదని అక్కడి డీఎం తెలిపారు. పంచదార ఎక్కువ అడుగుతున్నారన్నారు. అమలాపురంలో ఎఫ్‌సీఐ గోడౌన్‌ ఒకటే ఉందని, ముందు ముందు సమస్య వస్తుందని అక్కడి డీఎం తెలిపారు.  కోనసీమలో ఎండీయు వాహనాల ద్వారా ఇంటింటికీ బియ్యం ఇవ్వడానికి 5 చోట్ల ఓసీ కేటగిరిలోని అభ్యర్థులు ముందుకు రావడం లేదన్నారు.. కొన్నిచోట్ల ఎండీయూ వాహనం పరిధిలో 2వేల కంటే ఎక్కువ కార్డులు ఉండడం వల్ల సమస్య ఉందన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇక 2 వేల కంటే ఎక్కువ కార్డులు ఉంటే అదనంగా వాహనాలు ఏర్పాటు చేద్దామన్నారు. నిత్యావసర సరుకుల పేరున దోపిడీ జరుగుతోందని, ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్మితే కేసులు పెట్టాలని, వంటనూనెల ధరల విషయంలో విస్తృత దాడులు చేయాలని ఆయన ఆదేశించారు.  ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి  నిర్ణీత సమయంలో రైతుల అకౌంట్‌లో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ  రైతు భరోసా కింద  13,500 ఇచ్చినా పీసీపీ పోర్టర్‌లోని సమస్యల వల్ల రైతులు అసంతృప్తి చెందుతున్నారన్నారు. ఇన్‌కంటాక్స్‌ రూ.60 వేలు ఉన్నా కార్డు తీసేస్తున్నారని తెలిపారు. దీనిపై సీఎంతో మాట్లాడతానని మంత్రి చెప్పారు. పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్‌ మాట్లాడుతూ  ధాన్యం పరీక్షలు ఆర్బీకేలలోనే చేయాలని, మిల్లర్ల వద్ద చేస్తే, అందరి మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి జిల్లాలోనూ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి, రోజూ కనీసం 50 మంది రైతులతో నేరుగా మాట్లాడాలన్నారు. ప్రతీ కేంద్రంలో 3 వేల సంచులు ఉండేలా ఏర్పాటు చేసినట్లు జేసీ శ్రీధర్‌ తెలిపారు. రుడా  చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, సివిల్‌ సప్లైస్‌ జిల్లా మేనేజర్లు టీ.తులనీ, ఈ.లక్ష్మీ,  శ్రీ తనూజ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T06:31:46+05:30 IST