ఎంత దూరమైనా కొట్లాడుతాం: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-01T04:00:54+05:30 IST

తెలంగాణ హక్కులకోసం ఎంత దూరమైనా కొట్లాడుతామని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం

ఎంత దూరమైనా కొట్లాడుతాం: మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట: తెలంగాణ హక్కులకోసం ఎంత దూరమైనా కొట్లాడుతామని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. హక్కులకోసం పోరాడి తెలంగాణ తెచ్చిన తమకు హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఏడేళ్ల కాలంలో ఇతర రాష్ట్రాల ప్రజలు స్వరాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణలో సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ళందరూ తమ వాళ్లేనని మంత్రి  పేర్కొన్నారు. వారి గురించి జగన్ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. లాక్‌డౌలోనూ ఇతర రాష్ట్రాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదరించారని జగదీష్‌రెడ్డి తెలిపారు. 



ఏపీ ప్రభుత్వానికి దుర్బుద్ధిపుట్టి చెడాలోచనలు వస్తున్నాయని జగదీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నదీజలాలకు సంబంధించి సీఎం కేసీఆర్ నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదీజలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలోనే అప్పటి సీఎం చంద్రబాబుతో పైవారి జోక్యం లేకుండా కేసీఆర్ మాట్లాడుకుందామనుకున్నా జిమ్మిక్కులతోనే చంద్రబాబు ముందుకు పోయారని ఆయన విమర్శించారు.


కృష్ణా నీటి వినియోగంపై ఘర్షణ పెట్టుకున్నా ఉపయోగం లేదని, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్‌కు కేసీఆర్ చెప్పారని మంత్రి తెలిపారు. అకస్మాత్తుగా శ్రీశైలంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించి మూడు టీఎంసీల నీరు తీసుకుపోవడం, పోతిరెడ్డిపాడు కాలువను పెంచుతూ జీవోలు తెచ్చారని మంత్రి విమర్శించారు. గత సమైక్యాంధ్ర పాలనలోనూ పక్క రాష్ట్రాలతో పంచాయతీ పెట్టుకుంటూ ప్రజలను మోసం చేశారు తప్ప ప్రాజెక్టులు కట్టి ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. 


Updated Date - 2021-07-01T04:00:54+05:30 IST