రైతుల పట్ల కేంద్రానిది మొండి వైఖరి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-11-07T20:38:53+05:30 IST
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
నిర్మల్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీయం కేసీఆర్ ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్ట్ లు నిర్మించారని,దీంతో రాష్ట్రంలో సంవృద్ధిగా పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల పండిన పంటను అమ్ముకోని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్టాడినా వారి వైఖరిలో మార్పులేదన్నారు. తమ వద్ద నాలుగైదు ఏండ్లకు సరిపడా ధాన్యం ఉన్నదని, ఈ యాసంగిలో వడ్లు కొనలేమని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) చేతులెత్తేసిందన్నారు.కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల యాసంగి ధాన్యం కొనే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. రైతులు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశ్యంతోనే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందని, రైతులు వరికి బదులు వేరు శనగ, పొద్దు తిరుగుడు పువ్వు, సోయాలాంటి ఇతర వాణిజ్య పంటలను సాగు చేయాలని కోరారు.