ఆయా రామ్-గాయ రామ్ లతో తెలంగాణకు ఒరిగేదేమి లేదు
ABN , First Publish Date - 2022-07-04T22:01:16+05:30 IST
తెలంగాణ రాష్ట్రానికి ఎవరు వచ్చినా...ఎన్ని కుట్రలు పన్నినా.... బీజేపీ ఇలాంటి పది సభలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఎవరు వచ్చినా...ఎన్ని కుట్రలు పన్నినా.... బీజేపీ ఇలాంటి పది సభలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆయా రామ్-గాయ రామ్ లతో తెలంగాణకు ఒరిగేదేమి లేదని ఇక్కడ ప్రజలకు తెలుసునని అన్నారు.బిజెపి సభలపై మంత్రి స్పందిస్తూ ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పకుండా నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదే పదే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. తాము అధికారంలో కొచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని 2014 మ్యానిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ళలో ఎన్నిఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్నపదహారు లక్షల ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్ తమ స్వంత డప్పు కొట్టుకోవడమే కానీ తెలంగాణ అభివృద్దికి ఏం చేస్తారో చెప్పలేదన్నారు.తెలంగాణలో మెగా టైక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడం తప్ప.....తెలంగాణ కు పనికొచ్చే మాట ఒక్కటీ కూడా చెప్పలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ మొసలి కన్నీరు కారుస్తాన్నారని, ధాన్యం కొనకుండా అరిగోస పెట్టిన పీయూష్ గోయల్ కు తెలంగాణ రైతన్నల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.